ప్రమాదాల నివారణకు పోలీసులకు 10 బ్రీత్ ఎనలైజర్లు పంపిణీ..జాతీయ రహదారి 44పై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
ఇందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని గుర్తించేందుకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఢిల్లీకి చెందిన సేవ్ లైఫ్ ఫౌండేషన్ , వెర్టీస్ ఫౌండేషన్ సహకారంతో అందించిన 10 బ్రీత్ ఎనలైజర్లను జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అందుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి 44 (హైదరాబాద్ – నిజామాబాద్) మార్గంలో ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కొత్తగా వచ్చిన బ్రీత్ ఎనలైజర్ల ద్వారా వాహనదారులకు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.
రహదారులపై విలువైన ప్రాణాలు కోల్పోకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ఫౌండేషన్ నిరంతరం కృషి చేస్తోందని, మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని సీపీ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, సేవ్ లైఫ్ ఫౌండేషన్ అసిస్టెంట్ మేనేజర్ నూర్ కేతర్పాల్, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్ తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
