రంజాన్ మాసం సందర్భంగా నిర్వహించే ‘జగ్నెకీ రాత్’ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పలు మసీదులను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం రాత్రి సందర్శించారు.
ప్రార్థనలకు వచ్చిన ముస్లిం సోదరులతో మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలిపారు. నగరంతో పాటు ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. నగరంలోని ప్రధాన మసీదుల వద్ద పోలీసు యంత్రాంగం చేపట్టిన కట్టుదిట్టమైన బందోబస్తును సీపీ పరిశీలించారు.
అనంతరం అధికారులతో కలిసి స్వయంగా పెట్రోలింగ్లో పాల్గొన్నారు. మసీదుల పరిసరాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
పండుగ సమయాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి సమయాల్లో గస్తీని ముమ్మరం చేయాలి.
శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు కూడా పోలీసులకు సహకరించి, సామరస్య వాతావరణంలో పండుగలు జరుపుకోవాలన్నారు. సీపీ వెంట నిజామాబాద్ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతితో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
