విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవడం మనందరి బాధ్యతని రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా సీసీఎస్ విభాగంలో కానిస్టేబుల్గా పనిచేస్తూ గతేడాది అక్టోబర్ 18న మరణించిన ఎంపల్లి ప్రమోద్ కుమార్ పిల్లల విద్యాభ్యాసం కోసం టెర్మినస్ గ్రూపు ఆర్థిక సహాయం అందించింది.
ఈ మేరకు శనివారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, టెర్మినస్ గ్రూపు సీఎండీ ఎస్పీ రెడ్డి సమకూర్చిన విద్యా ఫీజుల చెక్కును ప్రమోద్ కుమార్ కుటుంబ సభ్యులకు డీజీపీ చేతుల మీదుగా అందజేశారు. ఎస్పీ రెడ్డి తండ్రి ఎస్.ఎల్.ఎన్ రెడ్డి గతంలో బోధన్లో డీఎస్పీగా సేవలందించారు.
ఆ అనుబంధంతో ప్రమోద్ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఎస్పీ రెడ్డి, వారి పిల్లల చదువుల బాధ్యతను స్వీకరించేందుకు తక్షణమే ముందుకు రావడం విశేషం. ఈ సందర్భంగా ఎస్పీ రెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న త్యాగాలు వెలకట్టలేనివని, వారి కుటుంబాలకు తమ వంతు సహకారం అందించడం సామాజిక బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
పోలీసు అమరవీరుల కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన టెర్మినస్ గ్రూపు సీఎండీకి నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య కృతజ్ఞతలు తెలిపారు.
ప్రమోద్ కుమార్ పిల్లల భవిష్యత్తుకు ఈ సాయం ఎంతో దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్యతో పాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
