చిన్నారులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో తోడ్పడతాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్ నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోర్గాం (పి) గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన ‘బాల పంచాయితీ’ (పిల్లల పార్లమెంట్) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, బాల పంచాయితీ అనేది కేవలం ఒక వేదిక మాత్రమే కాదని, పిల్లలు తమ జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై చర్చించుకునే అత్యున్నత ప్రజాస్వామ్య వ్యవస్థ అని అభివర్ణించారు.
విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలను కలిగి ఉండాలని, అప్పుడే వారి వ్యక్తిగత ఎదుగుదలతో పాటు సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.గ్రామంలోని పిల్లలందరూ క్రమం తప్పకుండా సమావేశమై, తమను వేధిస్తున్న సమస్యలను చర్చించి, పరిష్కారం కనుగొనేందుకు ఈ బాల పంచాయితీ ఒక పార్లమెంటులా పనిచేస్తుందని వివరించారు.
విద్యార్థి పాఠశాలకు వెళ్లేటప్పుడు సురక్షితంగా భావించే వాతావరణం నెలకొనాలని, అందుకు పిల్లలను నిర్ణయాత్మక ప్రక్రియలో భాగస్వాములను చేయడమే ఏకైక మార్గమని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, ఫోర్త్ టౌన్ ఎస్హెచ్ఓ సతీష్ కుమార్, ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ అమ్మాజీ, కార్పొరేటర్ నరేష్, డీసీపీఓ చైతన్య, ఏహెచ్టీయూ సీఐ సాయినాథ్, ఏహెచ్టీయూ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
