వరుసగా మూడోసారి జనరల్ మహిళకు రిజర్వ్.
స్పష్టం చేసిన ఎన్నికల సంఘం..
బరిలో నిలిచేందుకు గులాబీ, కాంగ్రెస్, బీజేపీ నేతల పోటీ..
నగర రాజకీయం మళ్లీ ‘మహిళా’మయం కానుంది. నిజామాబాద్ నగరపాలక సంస్థ మేయర్ పీఠం రిజర్వేషన్లపై ఉన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. త్వరలో జరగబోయే ఎన్నికల కోసం మేయర్ స్థానాన్ని వరుసగా మూడోసారి కూడా మహిళ (జనరల్) కే కేటాయిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా సందడి మొదలైంది. నగరపాలక సంస్థగా ఆవిర్భవించినప్పటి నుంచి నిజామాబాద్ మేయర్ పదవిలో మహిళల హవా కొనసాగుతోంది. గత రెండు పర్యాయాలు సైతం మహిళ (జనరల్) కే ఈ స్థానం కేటాయించబడింది. 2014లో బీఆర్ఎస్ నుంచి ఆకుల సుజాత తొలి మేయర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2020లో జరిగిన ఎన్నికల్లోనూ రిజర్వేషన్ మారకపోవడంతో బీఆర్ఎస్ నుంచే దండు నీతూ కిరణ్ మేయర్ పీఠాన్ని అధిరోహించారు. తాజా కేటాయింపుతో నిజామాబాద్ నగర చరిత్రలో వరుసగా మూడోసారి మహిళా మేయర్ కొలువుదీరడం ఖాయమైంది.
గెలుపు గుర్రాల వేటలో పార్టీలు..
రిజర్వేషన్ల ప్రకటన వెలువడటంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.మేయర్ పదవి జనరల్ మహిళకు రావడంతో అటు సీనియర్ నాయకుల భార్యలు, ఇటు పార్టీలో చురుగ్గా ఉన్న మహిళా నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
