నూతన కలెక్టర్ కార్యాలయం పక్కన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను వెంటనే అర్హులైన పేదలకు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి డిమాండ్ చేసారు. ఈ మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద శుక్ర వారం జెండా ను ఆవిష్కరించారు.
గత రెండు నెలల క్రితం నూతన కలెక్టరేట్ కార్యాలయం పక్కన కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఆ సమయంలో, ఆ ఇళ్లు అన్యాక్రాంతం అవుతూ, అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుతున్నాయని గుర్తించారు. వెంటనే ఆ ఇళ్లు పేదలకు అందించాలని, ఆగస్టు 14 వరకు గడువు ఇస్తున్నామని ప్రకటించారు. ఆగస్టు 15న నిరుపేదలతో కలసి గృహ ప్రవేశం చేస్తామని హెచ్చరించారు.
కానీ, రాజకీయ నాయకుల మాటల్లా ఇది కూడా మాటలకే పరిమితమవుతుందని అనుకున్నప్పటికీ, ఆగస్టు 13న మళ్లీ కలెక్టర్ గారికి లిఖిత పూర్వకంగా లేఖ పంపారు. దీనికి స్పందించిన కలెక్టర్, అదే రోజు మధ్యాహ్నం జిల్లా అధికారులను అక్కడికి పంపి తక్షణ చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల విజ్ఞప్తిని గౌరవిస్తూ, గృహప్రవేశం వాయిదా వేసి సహకరించామని దినేష్ పటేల్ తెలిపారు.
ఈ సందర్భంలో, జిల్లా వ్యాప్తంగా కట్టిన అన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిరుపేదలకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ శ్రేణులను ఉద్దేశించి, ఆగస్టు 18 నుంచి జిల్లాలో ఎక్కడైతే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఉన్నాయో, వాటిని పరిశీలించి పేదల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
“చట్టాన్ని ఎప్పుడూ చేతుల్లోకి తీసుకోకుండా, శాంతియుతంగా జాతీయ జెండా ఎగురవేశాం. కానీ, ఖాళీగా ఉన్న ఇళ్లను పేదలకు ఇవ్వాలి. లేకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం” అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో రూరల్ కన్వీనర్ పద్మ రెడ్డి, జగన్ రెడ్డి, ముస్కె సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్, అన్వేష్, లక్ష్మణ్, రూరల్ ప్రజలు పాల్గొన్నారు
