బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి..
అధికార పార్టీ అండదండలతో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, వందల కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డారన్న ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు.
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీవీఆర్ ఇన్ఫ్రా సంస్థ అధినేత అయిన వినయ్ రెడ్డి, గుండ్లపోచమ్మ గ్రామ పరిధిలోని సర్వే నంబర్-53లో (10,240 గజాల స్థలం) వేసిన వెంచర్లో అపార్ట్మెంట్ ప్లాట్లు ఇస్తామని నమ్మబలికి 61 మంది బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు చేశారు. వినయ్ రెడ్డి మాటలు నమ్మి మా సొంతూళ్లలో భూములు, బంగారం అమ్మి, వడ్డీలకు తెచ్చి డబ్బును వినయ్ రెడ్డి చేతిలో పెట్టారని పేర్కొన్నారు.
ఆరేళ్లుగా ఎదురుచూపు… ఇప్పుడు బెదిరింపులు!
డబ్బులు చెల్లించి ఆరేళ్లు గడుస్తున్నా, బాధితులకు ఇప్పటివరకు ప్లాట్లు అందలేదు. “రేపు ఇస్తాం, మాపు ఇస్తాం” అంటూ వినయ్ రెడ్డి కాలం వెళ్లబుచ్చుతూ వచ్చారనీ తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వినయ్ రెడ్డి వైఖరి పూర్తిగా మారిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు.
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలు నాకు ఉన్నాయి, మీకు ప్లాట్లు ఇవ్వను, ఏం చేసుకుంటారో చేసుకోండి,” అని వినయ్ రెడ్డి బెదిరిస్తున్నారని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారనీ తెలిపారు. ముఖ్యమంత్రి పేరును వాడుకుంటూ అవినీతికి, అరాచకాలకు పాల్పడుతున్న వినయ్ రెడ్డిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని బాధితులు మొరపెట్టుకుంటున్నారు. సర్వస్వం కోల్పోయి వీధిన పడిన తాము ఆత్మహత్యలే శరణ్యం అనుకునే స్థితికి చేరుకున్నామని వారు కన్నీళ్లతో వేడుకుంటున్నారనీ పేర్కొన్నారు.
