ఆర్అండ్బీ గెస్ట్హౌస్ గేటు వద్ద పోలీసుల తీరుపై వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సమీక్ష సమావేశానికి హాజరయ్యేందుకు ఇన్చార్జి మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్గౌడ్ నిజామాబాద్కు వస్తున్న నేపథ్యంలో గెస్ట్హౌస్ వద్దకు గడుగు గంగాధర్, నూడ చైర్మన్ కేశవేణు తమ వాహనాల్లో చేరుకున్నారు.
అయితే వారి వాహనాలను గేటు లోపలికి అనుమతించకుండా పోలీసులు అడ్డుకోవడంతో గడుగు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నేను వ్యవసాయ కమిషన్ సభ్యుడిని.. నా పక్కనే నూడ చైర్మన్ ఉన్నారు.
మా వాహనాలనే లోపలికి రానివ్వకుండా గేటు దగ్గర ఆపడం ఏమిటి? మా బండ్లు, మా వెహికల్స్ రాకపోతే ఇంకెవరివి వస్తాయి? ఇంకెవరిని లోపలికి పంపిస్తారు?’’ అంటూ పోలీసులను నిలదీశారు. ప్రభుత్వం తమదే అయినప్పటికీ అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ కమిషన్ సభ్యుల వాహనాలనే గెస్ట్హౌస్లోకి అనుమతించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
‘‘అసలు ఎవరు ఎవరిని పెడుతున్నారు? మా లీడర్లకు సిగ్గు, శరం లేదా? ప్రభుత్వం ఉండి కూడా మా ప్రతినిధుల వాహనాలను లోపలికి పంపించకపోతే ఇక్కడి వ్యవస్థ ఎటు పోతోంది?’’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
మంత్రి, పీసీసీ అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో భద్రతా చర్యల్లో భాగంగానే వాహనాలను నిలిపివేస్తున్నట్లు పోలీసులు చెప్పినప్పటికీ గడుగు వెనక్కి తగ్గలేదు. ప్రభుత్వ కమిషన్ సభ్యుడిగా తనను కనీసం గుర్తించకుండా వ్యవహరించడం అవమానకరమని మండిపడ్డారు.
గెస్ట్హౌస్ ప్రధాన గేటు వద్ద కొద్దిసేపు పోలీసులతో గడుగు గంగాధర్ వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
