కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలైన ఎన్ఎస్యూఐ , యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వ్యక్తిగత ఎజెండాలను పక్కన పెట్టి, పార్టీ ఆశయాలకు అనుగుణంగా క్రమశిక్షణతో పని చేయాలని నిజామాబాద్ కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1971 ఏప్రిల్ 9న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఆధ్వర్యంలో కేరళ స్టూడెంట్స్ యూనియన్, పశ్చిమ బెంగాల్ స్టేట్ ఛాత్ర పరిషత్లను విలీనం చేసి నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఎన్ఎస్యూఐ నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి నేడు పీసీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారని, అలాగే మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ కూడా విద్యార్థి విభాగం నుంచే నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. రాష్ట్ర అధిష్టానం ఆదేశాల మేరకు త్వరలోనే జిల్లా ఎన్ఎస్యూఐ కమిటీని ఎన్నికలు లేదా ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేస్తామని రామకృష్ణ వెల్లడించారు. ఎంపికైన వారు పార్టీ నియమావళికి లోబడి ఉండాలని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసే వారికే భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ మాజీ జిల్లా అధ్యక్షులు శరత్, జి.వి. రామకృష్ణ, రాంభూపాల్, గన్ రాజ్, విపుల్ గౌడ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు కాంగ్రెస్ నాయకులు ప్రమోద్, శివ, రాజు, సన్నీ గౌడ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
