ఇద్దరికి జైలు శిక్షనిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడిమద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన ఒక్క వారంలోనే (మే 18 నుండి మే 23 వరకు) కమిషనరేట్ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో రికార్డు స్థాయిలో 162 మంది డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డారు.
వీరందరినీ నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, న్యాయస్థానాలు వారికి భారీగా రూ. 16,00,000 (పదహారు లక్షల రూపాయలు) జరిమానా విధించాయి. అంతేకాకుండా, పట్టుబడిన వారిలో తీవ్రతను బట్టి ఇద్దరికి వారం రోజుల పాటు జైలు శిక్ష ఖరారైంది.
కమిషనరేట్ పరిధిలోని అన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టామని, చాలా మంది పరిమితికి మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిపోతున్నారని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు.
వాహన చోదకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పోలీస్ కమిషనర్ పలు కీలక సూచనలు హెచ్చరికలు జారీ చేశారు:డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే వారి డ్రైవింగ్ లైసెన్స్ను 6 నెలల పాటు సస్పెండ్ చేయడం జరుగుతుంది.
మద్యం తాగి వాహనం నడిపి ప్రమాదానికి గురైతే, సదరు వాహనానికి ఎలాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ లభించదు. మైనర్లు తాగి వాహనం నడిపితే, సదరు మైనర్తో పాటు వాహన యజమాని (ఓనర్) పైన కూడా ఛార్జ్షీట్ నమోదు చేసి, జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది.
ఒకసారి కంటే ఎక్కువ సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే కోర్టు ద్వారా ఖచ్చితంగా జైలు శిక్ష పడుతుంది.అలాగే వాహనదారులు తమ వాహనానికి సంబంధించిన అన్ని ఒరిజినల్ పత్రాలను ఎల్లప్పుడూ దగ్గర ఉంచుకోవాలి.
మోటార్ వెహికల్ యాక్ట్ (సవరణ – 2019) ప్రకారం మొదటి సారి పట్టుబడితే రూ. 10,000/- జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష (లేదా) జరిమానాతో కూడిన జైలు శిక్ష విధిస్తారు.
రెండో సారి పట్టుబడితే రూ. 15,000/- జరిమానా లేదా జైలు శిక్ష (లేదా) జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించడం జరుగుతుందని సూచించారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఎవరూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని సీపీ సాయి చైతన్య స్పష్టం చేశారు.
