నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీకి చెందిన కందగట్ల వెంకటేష్ (52) నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు.
భార్య పద్మావతి, పిల్లలు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో నివసిస్తుండటంతో, వెంకటేష్ గత కొంతకాలంగా ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నారు. శనివారం ఉదయం సుమారు 7:30 గంటల ప్రాంతంలో వెంకటేష్ నివసిస్తున్న ఇంటి కింది భాగంలో అద్దెకు ఉంటున్న గౌరయ్య అనే వ్యక్తికి పైనుంచి తీవ్రమైన దుర్వాసన రావడాన్ని గమనించారు.
వెంటనే ఆయన హైదరాబాద్లో ఉంటున్న వెంకటేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కంగారుగా అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు లోపలికి వెళ్లి చూడగా, బెడ్రూమ్లోని మంచంపై వెంకటేష్ మృత్యువాత పడి ఉన్నారు.
అప్పటికే మృతదేహం పూర్తిగా ఉబ్బిపోయి, కుళ్లిపోయిన స్థితిలో కనిపించింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
తన భర్త మృతిపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని మృతుడి భార్య కందగట్ల పద్మావతి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
