జిల్లాలో వివిధ కేసుల్లో పట్టుబడిన భారీ పరిమాణంలోని గంజాయినీ పోలీస్ అధికారులు దగ్ధం చేశారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 11 పోలీస్ స్టేషన్లలో గత కొంతకాలంగా సీజ్ చేసి భద్రపరిచిన సుమారు 410 కేజీల ఎండు గంజాయిని సోమవారం జక్రాన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పడకల గ్రామ శివారులో ఉన్న ‘శ్రీ మెడికేర్ సర్వీసెస్’ బయో మెడికల్ వేస్టేజ్ ప్లాంట్లో దగ్దం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ సాయి చైతన్య స్వయంగా హాజరై ఈ గంజాయి ధ్వంసం ప్రక్రియను పర్యవేక్షించారు. పక్కా నిబంధనల ప్రకారం, కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను అనుసరిస్తూ అత్యధిక ఉష్ణోగ్రత వద్ద ఈ మత్తు పదార్థాన్ని కాల్చి బూడిద చేశారు.
ఈ సందర్భంగా సీపీ సాయి చైతన్య మాట్లాడుతూ.. యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని స్పష్టం చేశారు.
నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తును కోర్టు అనుమతితో, డ్రగ్ డిస్పోజల్ కమిటీ సమక్షంలో బహిరంగంగా ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా గంజాయి విక్రయాలు జరిగితే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) జి. బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్తో పాటు పలువురు సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, బయో మెడికల్ వేస్టేజ్ సర్వీసెస్ ఎం.డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
