స్వయంగా కేసీఆర్ కుటుంబ సభ్యురాలు, పార్టీలో కీలక నేత కల్వకుంట్ల కవిత.. బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్, హరీష్ రావుల మీద చేసిన అవినీతి, ‘క్విడ్ ప్రో కో’ ఆరోపణలపై సీబీఐ చేత వెంటనే సమగ్ర విచారణ జరిపించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆయన గురువారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. కవిత చేసిన ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, వీటిపై ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా స్వతంత్ర సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు.
ఆరోపణలు చేసిన వ్యక్తి స్వయంగా కల్వకుంట్ల కవిత కావడంతో, వీటిని ప్రజా ప్రయోజనాల కోణంలో చూడాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నిధులు, ప్రదీప్ కన్స్ట్రక్షన్స్తో జరిగిన ఒప్పందాలు, ఫీనిక్స్ సంస్థకు రాజకీయ అండ, ఆంధ్రా కాంట్రాక్టర్లకు భూముల కేటాయింపులపై కవిత చేసిన వ్యాఖ్యలు అత్యంత తీవ్రమైనవని అర్వింద్ పేర్కొన్నారు.
ఇవి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవి కావడంతో స్వతంత్ర సీబీఐ దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ దర్యాప్తులో జాప్యం, ఈ-కార్ రేసులో ఆధారాలున్నా కేటీఆర్పై చర్యలు తీసుకోకపోవడం, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణం నిందితులను వదిలేయడం వంటి అంశాల వల్ల ప్రస్తుత ప్రభుత్వ చిత్తశుద్ధిపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారాల్లో ప్రభుత్వ తీరుపై ఎంపీ అర్వింద్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఈ పరిణామాల వల్ల ప్రస్తుత ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రజలు శంకిస్తున్నారని, కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీగా కుమ్మక్కయ్యాయనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందని ఆయన హెచ్చరించారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలంటే ప్రభుత్వం వెంటనే ఈ వ్యవహారాలను సీబీఐకి అప్పగించాలని, పూర్తి పారదర్శకతతో నిజానిజాలను వెలుగులోకి తీసుకువచ్చి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఎంపీ అర్వింద్ కోరారు.
