గంజాయి, దగ్గు సిరప్, మద్యం స్వాధీనంనగరంలో మత్తుపదార్థాల విక్రయాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్మూలన లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీసులు గురువారం తెల్లవారుజామున హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగర్ బస్తీలో భారీ స్థాయిలో ‘ఆపరేషన్ థండర్బోల్ట్’ పేరుతో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (క్రైమ్స్ అండ్ ఎస్ఐటీ) ఎస్.ఎం. శ్రీనివాస్,టాస్క్ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, స్వయంగా పర్యవేక్షించి ఈ ఆపరేషన్లో సాయుధ బలగాలు, ప్రత్యేక విభాగాల బృందాల సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
ఈ ప్రత్యేక ఆపరేషన్ గురువారం ఉదయం 3.30 గంటలకు ప్రారంభమైంది. ఆపరేషన్లో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్-న్యూ), టాస్క్ఫోర్స్, హెచ్-ఫాస్ట్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్), సి.ఎ.ఆర్ సాయుధ బలగాలు, స్థానిక సిటీ సివిల్ పోలీసులు సహా మొత్తం 1,100 మంది పోలీసులు పాల్గొని మంగర్ బస్తీ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడ పట్టారు.
తనిఖీల సందర్భంగా 150 గంజాయి ప్యాకెట్లు, 32 దగ్గు సిరప్ సీసాలు, ఒక కిలో ఎండు గంజాయి, మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రగ్స్ కేసులకు సంబంధించిన 15 మంది నేరస్థులను, ఆస్తి నేరాలు, గొలుసు దొంగతనాలు, నాన్బెయిలబుల్ వారెంట్లు (ఎన్బీడబ్ల్యూ) పెండింగ్లో ఉన్నవారితో పాటు 50 మంది అనుమానిత ఆస్తి నేరస్థులను అదుపులోకి తీసుకున్నారు.
మొత్తం 65 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగరంలో గంజాయి, డ్రగ్స్ విక్రయాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై నిరంతరం ఉక్కుపాదం మోపుతామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు హెచ్చరించారు.
