ఈ వర్షాకాలం సీజన్లో ఓవైపు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే మరోవైపు చికెన్ ధరలు మాంసం ప్రియులకు అందుబాటులోకి వచ్చాయి.
కూరగాయల మార్కెట్ కి వెళ్తే పెరిగిన ధరలను చూసిన సామాన్యుడు ఏమి కొనేటట్లు లేదు ఏమి తినేటట్లు లేదు అన్న చందంగా తయారయిందని వాపోతున్నప్పటికీ, చికెన్ ప్రియులకు మాత్రం నోరూరించే చికెన్ వంటకాలు అందుబాటు ధరలోకి వచ్చాయి.
దీంతో మద్యం ప్రియులు మామ.. పార్టీ చేసుకుందాం రా… అంటూ ఎంచక్కా దావత్ మూడ్ లోకి వెళ్ళిపోతున్నారు. చికెను.. ఓ చికెను… తినకుండా ఉండలేను సెకను…. అని ఓ గేయకారుడు పాడినట్టుగా అందరి మనసులు చికెన్ ను కోరుకుంటున్నాయి.
మద్యం ధరల మాట అటు ఉంచితే, తగ్గిన చికెన్ ధరలు మాత్రం మందుబాబులకు ఊరట కలిగిస్తున్నాయి, దీంతో జిల్లాలోని ఆర్మూర్, బోధన్ , నిజామాబాద్ డివిజన్ లో గల అన్ని మండల కేంద్రాలతో పాటు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మద్యం ప్రియులు దావత్ ల జోషులో ఉన్నారు.
దీంతో ముఖ్యంగా ఆర్మూర్ డివిజన్లో మాంసాన్ని వండి ఇచ్చే ఆర్డర్ మెస్ లు కళకళలాడుతున్నాయి. కూరగాయలకు పడే తంట చికెన్ కు ఉండకపోవడంతో ప్రజలు ఎక్కువగా చికెన్ వండుకునేందుకు ఇష్టపడుతున్నారు.
గతంలో 200 రూపాయలు తీసుకొని కూరగాయల మార్కెట్ కు వెళితే సంచి నిండా వారానికి సరిపడ కూరగాయలు తెచ్చుకునేవారు. కానీ ప్రస్తుతం పెరిగిన ధరలు శాకాహారులకు చుక్కలు చూపెడుతున్నాయి. అయితే ప్రస్తుతం చికెన్ మార్కెట్లో కనిష్టంగా 140 రూపాయల ధర పలుకుతుండడంతో ఎంచక్కా ఎక్కువ శాతం మాంసాహారులు చికెన్ వైపే మొగ్గుచూపుతున్నారు.
అంతేగాక మందుబాబుల్లో మందుతోపాటు, మాంసం కూడా అందుబాటు ధరలో ఉండడంతో దావత్ లా జోష్ కనబడుతుంది.
