వసతి గృహాలు, విద్యా సంస్థల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు… కలెక్టర్ ఇలా త్రిపాఠి….అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండాలి…విద్యార్థులను సొంత బిడ్డలుగా భావించాలి..వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని హితవు..మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి…
జిల్లాలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా విద్యార్థులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖలు, విద్యాశాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాలు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల పనితీరుపై అదనపు కలెక్టర్ వి.భుజంగరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన, ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు నాణ్యతతో కూడిన విద్యను అభ్యసించేలా నిర్వాహకులు కృషి చేయాలని అన్నారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలలలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు దోమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని అన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారం అందించడంతో పాటు ఆహార పదార్థాల నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని తెలిపారు. ప్రతి పాఠశాల, వసతి గృహంలో డైట్ మెనూ పట్టికను విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ కమిటీలు చురుకుగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి విద్యా సంస్థలో స్వచ్ఛమైన, రక్షిత తాగునీటి సరఫరా ఉండేలా చూడాలని, విద్యార్థుల ఆరోగ్య రక్షణ విషయంలో రాజీ పడకూదని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విద్యా బోధన జరిగేలా ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాలని, విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో వంద శాతం విద్యార్థుల నమోదు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు.
అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.విద్యార్థులను సొంత పిల్లలుగా భావిస్తూ, వారి భద్రత, ఆరోగ్యం, సంక్షేమం, అభ్యున్నతి కోసం అంకిత భావంతో పని చేయాలని సూచించారు. ఆంగ్ల భాషలో విద్యార్థులు ప్రావీణ్యం సాధించేలా చూడాలన్నారు.
బాలికల వసతి గృహాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు అవసరం ఉన్నట్లయితే, ఈ నెల 20వ తేదీ లోపు వివరాలు సమర్పించాలని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, విద్యా సంస్థల నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
ఆయా ప్రభుత్వ విద్యా సంస్థలలో పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని అన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్నది తమ అభిమతం కాదని, అయితే విద్యార్థుల భద్రత, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం బాధ్యులను ఉపేక్షించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.
తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, నిర్వహణాపరమైన లోపాలు దృష్టికి వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, డీ.ఎస్.సీ.డీ.ఓ రజిత, జిల్లా విద్యా శాఖ అధికారి పి.అశోక్, ఆర్.సీ.ఓ కు, సంబంధిత సంక్షేమ శాఖల హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, విద్యాశాఖ అధికారులు, రెసిడెన్షియల్ విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్, స్పెషలాఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.
