మున్సిపల్ కార్మికుల కనీస వేతనం నెలకు రూ.26వేలు వేతనం ఇవ్వాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
మున్సిపల్ కార్మికుల స్థానిక సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులు పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మార్వో కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు రమేష్ బాబు మాట్లాడుతూ…మున్సిపల్ కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన సూచన ప్రకారం నెలకు 26 వేల కనీస వేతనం పెంచాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా కేటగిరీల వారీగా వేతనాలను ఇవ్వాలని కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు జరపాలని ప్రధానంగా ప్రభుత్వ సంస్థల్లో పని చేసే కార్మికులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని కోరారు.
స్థానికంగా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అనేకమార్లు మున్సిపల్ కమిషనర్ కి, అధికారులకు తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
ప్రధానంగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులకు నెలనెలా ఇవ్వాల్సిన సబ్బులు ,నూనెలు, సంవత్సరానికి రెండు జతలు చెప్పులు బట్టలు ఇవ్వటంలో నిర్లక్ష్యం కనబరుస్తున్నారని బట్టలు కుట్టుకూలీ కూడా ఇవ్వటం లేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
అదేవిధంగా చనిపోయిన కార్మికులకు దాన సంస్కారాలకు రూ.20000 ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని అమలు జరపటం లేదని ఇప్పటికీ కార్పొరేషన్ పరిధిలో 25 మంది కార్మికులు చనిపోయారని తెలిపారు.
ఇతర అనేక కార్పొరేషన్లు శానిటేషన్ ఉన్న డ్రైవర్లకు ప్రభుత్వం పెంచిన వెయ్యి రూపాయలను అమలు జరుపుతున్నప్పటికీ నిజామాబాద్ నగర కార్పొరేషన్ మాత్రం అమలు జరపటం లేదని ఇది కార్మికుల పట్ల వివక్షత చూపుతున్నారని విమర్శించాడు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు భూపతి, ఏక్ నాథ్, సంతోష్ సింగ్, మోహన్, సూర రవి, గంగ శంకర్, శ్రావణ్, వెంకటేష్, మహేష్, సదానంద్, లక్ష్మణ్, నరేష్, సంతోష్ గౌడ్, ఎల్లయ్య, రాము, వినోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
