నందిపేట మండల కేంద్ర నియో లిటిల్ ఫ్లవర్ పాఠశాల ముంగట గల ఇంట్లో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
ఇంట్లో ఉన్న గంధం గంగమణి కేకలు పెడుతూ బయటకు రావడంతో స్థానికులు వెంటనే తేరుకొని మంటలు ఆర్పేందుకు శతవిధాల ప్రయత్నం చేసి చివరకు మంటలను ఆర్పేశారు.
స్థానిక యువకులు మంటలను ఆర్పడం వల్ల పెను ప్రమాదం తప్పడంతో చుట్టుపక్కల వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. మంటలంటుకోవడం వల్ల ఇంట్లో ఉన్న విలువైన బట్టలు, బెడ్డు కాలిపోయాయి.
మంటలు ఆర్పే సమయంలో స్థానికులు నీళ్లు పోయడం వల్ల ఇంట్లో ఉన్న బియ్యము ఇతరాత్ర సామానంత పనికిరాకుండా పోయింది. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ., అగ్ని ప్రమాదం జరిగిందని మాకు సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నామని అంతలోపే స్థానిక యువకులు మంటలు ఆర్పేయడం జరిగిందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని అన్నారు.
ఘటన జరిగిన సమయంలో స్థానికులు భయపడద్దని, ప్రమాదం జరిగినప్పుడు తెలివిగా ఆలోచించి మంటలను ఎలా ఆర్పాలో ఆలోచించాలని, గ్యాస్ సిలిండర్ వద్ద లీకై మంట లు ఎగిసిపడుతున్నప్పుడు రెగ్యులేటర్ ఆఫ్ చేసేందుకు ప్రయత్నించాలని, లేదంటే మందపాటి గోనెసంచిని నీళ్లలో నాన్పి గ్యాస్ బండ చుట్టూ చుట్టేస్తే సరిపోతుందన్నారు.
తొందరపడి నీళ్లు పోయడం, గ్యాస్ బండను బయట పారేయడం లాంటివి చేయకూడదని, వెంటనే అగ్నిమాప సిబ్బందికి సమాచారం అందించాలని, పలు అంశాలపై అక్కడున్న మహిళలకు, స్థానికులకు, కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.