సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో జరిగిన మహమ్మద్ ఫాసి అహ్మద్ అమీర్ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలు, వ్యక్తిగత గొడవల నేపథ్యంలో హత్యకు పాల్పడిన 21 ఏళ్ల ఆటోడ్రైవర్ ఎండ్రావత్ సుమన్ @ ఎంజ్రావత్ సుమన్ను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని సరూర్నగర్ చెరువులో పడేసిన నిందితుడి నుంచి పోలీసులు దాన్ని హైడ్రా సిబ్బంది సహకారంతో వెలికితీశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు మహమ్మద్ ఫాసి అహ్మద్ అమీర్, నిందితుడు ఎండ్రావత్ సుమన్ మధ్య గతంలో పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. ఆగస్టు 6న ఉదయం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సుమన్ పదునైన కత్తితో అమీర్పై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం నిందితుడు ఆటోలో అక్కడి నుంచి పరారయ్యాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని సరూర్నగర్ చెరువులో పడేసి సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించాడు. దర్యాప్తులో పోలీసులు నిందితుడి వద్ద నుంచి రక్తపు మరకలున్న దుస్తులు, ఆటోరిక్షా, మొబైల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (హైడ్రా) సహాయంతో చెరువులో గాలించి కత్తిని వెలికితీశారు. నిందితుడు ఎండ్రావత్ సుమన్ @ ఎంజ్రావత్ సుమన్ ఆటోరిక్షా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సింగరేణి కాలనీ, సైదాబాద్లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.
ఈ అరెస్టు చర్యలు చార్మినార్ జోన్ డీసీపీ ఖారే కిరణ్ ప్రభాకర్, అదనపు డీసీపీ మహమ్మద్ మజీద్, సైదాబాద్ డివిజన్ ఏసీపీ సోమ వెంకట్ రెడ్డి, సైదాబాద్ ఎస్హెచ్ఓ బి. చంద్రమోహన్ పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది నిర్వహించారు.
