నిజామాబాద్ మున్సిపల్ రాజకీయాల్లో మేయర్ పీఠం మరోసారి వెనకబడిన వర్గాలనే (BC) వరించింది. కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు సామాజిక సమీకరణాల్లో బీసీలదే పైచేయిగా నిలుస్తోంది.
తాజా ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు, అనూహ్య మలుపుల మధ్య ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కూరగాయల ఉమారాణి నిజామాబాద్ నాలుగో మేయర్గా పగ్గాలు చేపట్టనున్నారు. ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ ఈ పీఠాన్ని కైవసం చేసుకోవడంతో నగర రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది.
2005లో నిజామాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్గా ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు మేయర్ పదవి బీసీలకే దక్కుతూ రావడం గమనార్హం.
గత చరిత్రను పరిశీలిస్తే మొదటి మేయర్ గా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ధర్మపురి సంజయ్.
రెండో మేయర్: బిఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) నుంచి ఆకుల సుజాత.
మూడో మేయర్ బిఆర్ఎస్ నుంచి నీతు కిరణ్.లు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు.
వరుసగా నాలుగో మేయర్ ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కూరగాయల ఉమారాణి కూడా బీసీ సామాజిక వర్గాల చెందిన మహిళ కావడం విశేషం.
ఈసారి మేయర్ పీఠం ‘జనరల్ మహిళ’కు కేటాయించడంతో నగరంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. తొలుత కాంగ్రెస్ పార్టీ తరఫున బలమైన అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త నరేందర్ రెడ్డి సతీమణి సమంత కట్పల్లి పేరు వినిపించింది.
ఆమె గెలుపు కోసం ఏకంగా రూ. 8 కోట్ల పన్ను బకాయిలు చెల్లించి ‘నో డ్యూస్’ సర్టిఫికేట్ పొందడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, అనూహ్యంగా ఆమె ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యాయి.
సమంత వైదొలగడంతో పోటీ బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళల మధ్యకు మారింది. ఈ క్రమంలో 49వ డివిజన్ నుంచి విజయం సాధించిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కూరగాయల ఉమారాణిని కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది.
నిన్నటి వరకు సామాన్య గృహిణిగా జీవనోపాధి పొందుతూ ప్రజా సేవలో ఉన్న ఆమె, నేడు ఏకంగా నగర ప్రథమ పౌరురాలిగా ఎంపిక కావడం విశేషం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
సొంత జిల్లాలో పట్టు పట్టి బీసీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ, మేజిక్ ఫిగర్ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం సహకారంతో పీఠాన్ని దక్కించుకుంది. ఒప్పందంలో భాగంగా ఎంఐఎం కార్పొరేటర్ సల్మా తహసీన్ డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు.
ఒక సామాన్య గృహిణి అయిన ఉమారాణికి మేయర్ పదవి దక్కడం పట్ల నగర ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇది సామాన్యుల విజయమని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
