నగరంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహణజిల్లాలో రాబోయే అన్ని పండుగలను పురస్కరించుకొని ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో, సోదరభావంతో వేడుకలు జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు.

శనివారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్లోని కమాండ్ కంట్రోల్ హాల్లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని అన్ని మతాల పెద్దలతో ఆయన ‘శాంతి కమిటీ సమావేశం’ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ..నిజామాబాద్ జిల్లా భిన్నత్వంలో ఏకత్వానికి, మత సామరస్యానికి నిలయమని ఆయన కొనియాడారు. రంజాన్, హోలీ, ఉగాది పండుగలను అందరూ కలిసికట్టుగా జరుపుకోవాలని కోరారు.
సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు ప్రచారాలను, వదంతులను ఎవరూ నమ్మవద్దని సూచించారు. రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.అలాగే రంజాన్ మాసం దృష్ట్యా మసీదుల వద్ద ప్రార్థనలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పటిష్ట భద్రతతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని లేదా ‘డయల్ 100’ సేవలను వినియోగించుకోవాలని కోరారు. మత పెద్దలు చెప్పే మాటలను ప్రజలు గౌరవిస్తారని, కావున క్షేత్రస్థాయిలో ప్రజలందరూ సంయమనంతో ఉండేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందని సిపి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి, ఏసీపీలు ప్రకాష్, శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, వివిధ స్టేషన్ల సీఐలు జిల్లాలోని అన్ని మతాల ప్రతినిధులు పాల్గొన్నారు.
