వారం రోజుల్లో 232 కేసులు!
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఉక్కుపాదం మోపుతోంది. గడిచిన వారం రోజుల్లో కమిషనరేట్ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 232 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు సీపీ సాయి చైతన్య ఓ ప్రకటనలో తెలిపారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహించిన ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 232 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.
పట్టుబడిన వారందరినీ పోలీసులు సంబంధిత కోర్టుల్లో హాజరు పరచగా 232 మందికి కలిపి మొత్తం రూ. 22,40,000 జరిమానా విధించినట్లు తెలిపారు. అలాగే ఆరుగురికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని ఆయన పేర్కొన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం కలగడమే కాకుండా, కఠిన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందనీ ఆయన పేర్కొన్నారు.అలాగే ప్రతి వాహనదారుడు తమ వెంట వాహనానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా ఉంచుకోవాలి. ప్రజల భద్రత దృష్ట్యా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
