రైలు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడి ఓ గుర్తుతెలియని వృద్ధుడు (60) మృతి చెందిన సంఘటన గురువారం జానకంపేట–నిజామాబాద్ రైల్వే మార్గంలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
గురువారం ఉదయం 10 గంటల సమయంలో జానకంపేట–నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య కిలోమీటర్ నంబర్ 456/03-04 వద్ద ఒక వృద్ధుడు రైలు నుంచి పడిపోయినట్లు సమాచారం అందింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు.
మృతుడి వయస్సు సుమారు 60 ఏళ్లు ఉంటాయని, అతను ఏ రైలులో ప్రయాణిస్తున్నాడనేది తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించకపోవడంతో వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎం. హన్మాండ్లు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మృతుడికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డిని 8712658591 నంబరులో సంప్రదించాలని కోరారు.
