తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని ఇక అయిపోయినట్లే అని, ఇదే అంశం రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనూ తేలిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
తన పరిపాలన పైన, తన నాయకత్వం పైన, సగం పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒక విస్తృత సర్వేను చేయించుకున్నారని, అందులోనూ ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైందన్నారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే భారత రాష్ట్ర సమితి సుమారు 78 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ సర్వేలో తేలిందన్నారు.దీంతో పాటు రెండు మీడియా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు చేసిన ప్రజాభిప్రాయ సేకరణలోనూ ఇదే అంశం వ్యక్తమైందన్నారు.
మరోసారి ప్రజలు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నామని స్పష్టంగా తమ అభిప్రాయం చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.అయితే, తన సొంత సర్వేతో పాటు పలు సర్వేల్లో వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను చూసి తట్టుకోలేకనే ముఖ్యమంత్రి గత వారం రోజులుగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారన్నారు.
దీంతో పాటు తన పరిపాలన వైఫల్యాలను ముఖ్యంగా కప్పిపుచ్చుకునేందుకు అనేక అటెన్షన్ డైవర్షన్ పనులు చేస్తున్నారని, అందులో భాగంగానే కాళేశ్వరం నుంచి మొదలుకొని రైతుబంధు వరకు అన్నింటిపైన అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ పతనం దాదాపు ఖాయమైపోయిందని, సగం పరిపాలనా కాలం ముగిసిన తర్వాత ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారన్నారు.
ఇచ్చిన గ్యారంటీల అమలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు, 420 హామీల అమలులో పూర్తిగా విఫలమైనందు వల్లనే తెలంగాణలోని సబ్బండ వర్గాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై నమ్మకం కోల్పోయారన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐఆర్ కు సంబంధించి పార్టీ నియమించుకున్న బూత్ లెవెల్ అసిస్టెంట్ల (BLAs) సహకారంతో ఏ ఒక్కరి ఓటు పోకుండా చూడాలన్నారు.
ఎస్ఐఆర్ కు సంబంధించిన అంశంలో ఎదురవుతున్న ఇబ్బందులను, ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ని, సమస్యలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు పార్టీ తరఫున తీసుకుపోతున్నట్లు తెలిపారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో జరిగిన సమావేశంలో జీహెచ్ఎంసీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గాల ఇంచార్జ్ లు, సీనియర్ నాయకులకు ఎస్ఐఆర్ పైన ఆయన దిశా నిర్దేశం చేశారు.
