ఇందూరు: సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలన్నదే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ లక్ష్యమని, అదే దిశగా బీజేపీ పని చేస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా ప్రశిక్షణా తరగతులు గురువారం నగరంలోని బోర్గాం లో గల ఫంక్షన్ హాల్ లో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశము ఒక భౌగోళిక ప్రాంతమే కాదని.. వేల సంవత్సరాల సంస్కృతి, సంప్రదాయాల విలువల సమాహారం అన్నారు. వసుదైక కుటుంబంగా భావించే గొప్ప సంస్కృతి కలదన్నారు.
ప్రధానంగా సబ్ కా సాద్.. సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదాలతో బీజేపీ ముందుకెళ్తుందన్నారు. కార్యకర్తలు నాయకులకు కూడా పార్టీ సూచించిన మార్గంలో ముందుకెళ్లాలని, శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకొని ప్రజలకు చేరువకావాలన్నారు. బీజేపీ అనుబంధ సంస్థలతో ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతూ ముందుకు సాగాలన్నారు. అన్ని సంస్థలతో సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ప్రతి ఒక్కరు దీన్ దయాల్ ఉపాధ్యాయ చరిత్ర చదవాలని సూచించారు. ప్రధానంగా బిజెపి భావజాలాన్ని కేంద్ర పథకాలను సోషల్ మీడియా వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరేసే బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, పసుపు బోర్డు జాతీయ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, రాష్ట్ర నాయకులు నాయుడు ప్రకాష్, మల్లిఖార్జున్, సీనియర్ నాయకులు భూపతి రెడ్డి, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
