నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు విధించడం జరిగిందని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. మనీ లెండర్స్ యాక్టు కేసులను అనుసరిస్తూ నిజామాబాద్ నగరానికి చెందిన ఐదుగురు వడ్డీ వ్యాపారులకు రూ. 25 వేల నుండి రూ. 50 వేల వరకు జరిమానాలు విధించామని వివరించారు.
మొదటి తప్పుగా గుర్తించి సాధారణ జరిమానాలు మాత్రమే విధించడం జరిగిందని అన్నారు. వడ్డీ వ్యాపారాలు చేసే వారందరూ తప్పనిసరిగా తగిన అనుమతులు (లైసెన్స్) కలిగి ఉండాలన్నారు. నియమ, నిబంధనలు తు.చ తప్పక పాటించాలని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రికార్డులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారాలు నిర్వహించే వారిపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
