నగరంలోని పెద్దబజార్లో సోమవారం అర్ధరాత్రి భారీ ప్రమాదం తప్పింది. ఒక ఇంట్లో సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన పోలీసులు ప్రాణనష్టం జరగకుండా అడ్డుకుని మానవత్వాన్ని చాటుకున్నారు.
ఘటన వివరాల్లోకి వెళ్తే..పెద్దబజార్ ప్రాంతంలోని దాసరి రమేష్ అనే వృద్ధుడు తన భార్యతో కలిసి నివాసముంటున్నారు. వారు అదే ఇంట్లో చిన్న కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఒక్కసారిగా విద్యుత్ ఘాతం (షార్ట్ సర్క్యూట్) సంభవించి మంటలు అలుముకున్నాయి.
లోపల దంపతులు గాఢ నిద్రలో ఉండటంతో ప్రమాదాన్ని గమనించలేకపోయారు. ఆ సమయంలో గస్తీ నిర్వహిస్తున్న రెండవ టౌన్ పెట్రోలింగ్ పోలీసులు మంటలను గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇంటి తలుపులు తట్టి, నిద్రలో ఉన్న వృద్ధ దంపతులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక యంత్రం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. సిబ్బంది శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు.
ఈ ప్రమాదంలో కిరాణా దుకాణంలోని కొంత సామాగ్రి దహనమైందని, సుమారు వేలల్లో ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి, ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతులను కాపాడిన రెండో టౌన్ పోలీసులపై స్థానికులు, కాలనీ వాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
“పోలీసులు సకాలంలో స్పందించకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని” స్థానికులు పేర్కొన్నారు.
