నగరంలో నిర్దేశిత వ్యాపార సమయాలు ముగిసిన తర్వాత కూడా నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు తెరిచి ఉంచే వారిపై ఒకటవ టౌన్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గత కొన్ని రోజులుగా నగర పరిధిలో ప్రత్యేక తనిఖీలు చేపట్టిన పోలీసులు, సమయం దాటినా వ్యాపారాలు నిర్వహిస్తున్న నలుగురిపై కేసులు నమోదు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం… నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి వేళల్లో అనుమతించిన సమయం కంటే అదనంగా షాపులు నడుపుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన పూసలగల్లీకి చెందిన రెడీమేడ్ షాప్ నిర్వాహకుడు అబ్దుల్ ఇద్రిస్, అనురాగ్ ఐస్క్రీమ్ షాప్ యజమాని ఆలూరు దాస్, ఫ్లవర్ షాప్ నడుపుతున్న ఎండి ముజీబ్తో పాటు షేక్ అబ్బు అనే వ్యక్తిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
కేసు నమోదైన ఈ నలుగురు నిందితులను పోలీసులు సోమవారం నిజామాబాద్ స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి నిందితులకు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.
కోర్టు ఉత్తర్వుల మేరకు నిందితులను వెంటనే జిల్లా కేంద్ర కారాగారానికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం దాటిన తర్వాత కూడా ఎవరైనా షాపులు తెరిచి ఉంచితే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
వ్యాపారులంతా నిబంధనలకు లోబడి సహకరించాలని వన్ టౌన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రఘుపతి హెచ్చరించారు.
