ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసి, అనంతరం బెదిరింపులకు పాల్పడిన వ్యక్తికి నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. చాదర్ఘాట్ పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్ జిల్లా సోమవార్పేటకు చెందిన అనంతూల అభిలాష్కు, మలక్పేట్ ఆనంద్నగర్కు చెందిన శ్యామ్సుందర్కు పాత పరిచయం ఉంది.
తనకు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని, మంచి జీతంతో కూడిన ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బాధితుడి నుంచి డబ్బులు తీసుకున్నాడు. అయితే హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితుడు పలుమార్లు ప్రశ్నించాడు.
ఈ క్రమంలో 2017 మార్చి 5న నిందితుడు కొంతమందితో కలిసి బాధితుడి ఇంటికి వెళ్లి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు చాదర్ఘాట్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. క్రైమ్ నంబర్ 99/2017 కింద నమోదు చేసిన కేసులో పోలీసులు సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన నాంపల్లి VIII ఏసీజేఎం కోర్టు న్యాయమూర్తి సీహెచ్. సంపత్ గురువారం తీర్పు వెలువరించారు.
నిందితుడు అనంతూల అభిలాష్పై ఆరోపణలు రుజువైనట్లు నిర్ధారిస్తూ ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన అప్పటి దర్యాప్తు అధికారి ఎ. రాజశేఖర్రెడ్డి, కోర్టులో వాదనలు వినిపించిన సహాయ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జె. రమణితో పాటు కేసు నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని చాదర్ఘాట్ ఎస్హెచ్వో అభినందించారు.
