నేడు, రేపు మండల కేంద్రాల్లో నిరసనలు.. ఎంఆర్ఓలకు వినతి పత్రాలు..ఎన్నికల వేళ ప్రజలకు వందలాది హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు వారిని నట్టేట ముంచిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి విమర్శించారు.
మంగళవారం ఇందూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కార్పై పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 వాగ్దానాల్లో కనీసం ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, ఇది ప్రజలను వంచించడమేనని మండిపడ్డారు. మొక్కజొన్న రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదని, మార్కెట్లో ₹1500–₹1600 మధ్య ధర ఉండటంతో రైతులు భారీగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు రుణమాఫీ ప్రక్రియ కూడా అసంపూర్తిగా మిగిలిపోయిందని విమర్శించారు. నిరుద్యోగ భృతి ఊసే లేదని, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చుమీరిపోయిందని, మహిళా భద్రత గాలికి వదిలేశారని ఆరోపించారు.
జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, సలహాదారులకు ప్రజల సమస్యల కంటే పదవులే ముఖ్యమయ్యాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల తరఫున గళమెత్తుతామని పేర్కొన్న ఆయన, భవిష్యత్ కార్యాచరణను వెల్లడించారు: మార్చి 17, 18న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద నిరసన తెలిపి, వినతి పత్రాలు అందజేస్తారనీ తెలిపారు. అలాగే మార్చి 21న వేలాది మందితో జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తామన్నారు.
ఈ సందర్భంగా సమగ్ర నివేదికను కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. ఈ పోరాటంలో రైతులు, నిరుద్యోగులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతనకర్ లక్ష్మి నారాయణ, నాగోల్ల లక్ష్మి నారాయణ, ఉపాధ్యక్షులు ప్రమోద్ కుమార్, కార్పొరేటర్లు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
