కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. ఆరు నెలల గర్భిణి అయిన భార్యను గొంతు నులిమి హతమార్చాడు. అల్వాల్ పోలీస్స్టేషన్ పరిధి సూర్యనగర్లో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సూర్యనగర్లో నివాసముంటున్న పరశురామ్కు ఏడాది కిందట శివానితో వివాహమైంది. పరశురామ్ ర్యాపిడో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
కొంతకాలంగా దంపతులు అన్యోన్యంగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం శివాని ఆరు నెలల గర్భిణి. ఆదివారం రాత్రి పరశురామ్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. అర్ధరాత్రి సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది.
మాటామాటా పెరగడంతో ఆగ్రహానికి గురైన పరశురామ్ భార్యపై దాడి చేసి, ఆమె గొంతు నులిమినట్లు పోలీసులు తెలిపారు. ఊపిరాడక శివాని అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.భార్యపై అనుమానంతోనే పరశురామ్ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్లూస్టీమ్తో కలిసి ఇంట్లో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
