మనిషి ఆశకు ఒక హద్దు ఉంటుంది. ఆశలు ఆకాశ గగనాన విహరించినప్పుడు, అవసరం గడప దాటి వీధులలో నాట్యమాడినప్పుడు…
మోసం చేసేవాడు ఆడిందే ఆటగా.. ఆడిందే పాటగా తయారవుతుంది పరిస్థితి. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేస్తూనే ఉంటారు ఈ ఘరానా కేటుగాళ్లు.
తాజాగా ఆర్మూర్ పట్టణంలో స్కీం పేరుతో స్కాంకు ఎగబడుతు బురిడీ కొట్టించారు మాయగాళ్ళు. ఆర్మూర్ పట్టణంలో ఇతర రాష్ట్రాలకు చెందిన ఇద్దరు స్కీం పేరుతో ఓ స్కాంకు ఎగబడ్డారు.
ఇది ఎరగని అమాయక జనం అడ్వాన్సుగా డబ్బులు కట్టి అదృష్టాన్ని పరీక్షించుకుందామనుకున్నారు. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి రోడ్డులో గల విఆర్ కాంప్లెక్స్ లో తిరుమల ట్రేడర్స్ పేరుతో ఓ ఆర్డర్ సప్లయర్స్ దుకాణాన్ని ప్రారంభించారు.
అయితే ప్రారంభోత్సవ డిస్కౌంట్ ఆఫర్ పేరుతో ఇంటికి అవసరమయ్యే ఫర్నిచర్ తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను 40 శాతానికి తక్కువ ధరకే ఇస్తామంటూ ప్రకటన వెలువరించడంతో ప్రజలు బారులు తీరి డబ్బులు కట్టారు.
సుమారు కోటి రూపాయలకు పైగానే డబ్బులు వసూలు చేసినట్టు తెలుస్తుంది. సదరు ట్రేడర్స్ యజమాని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. గత 15 రోజులుగా కలెక్షన్లకు ఎగబడ్డ ఈ కేటుగాళ్ళు…
గత ఐదు రోజులుగా దుకాణం మూసి.. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో షాపు చుట్టూ ప్రదక్షిణ చేయడం బాధితుల వంతు అయింది. మోసాన్ని గ్రహించిన కొందరు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘరానా మోసం పై విచారణ జరపాలని బాధితులు కోరుతున్నారు. సీన్ కట్ చేస్తే.. గత 30 సంవత్సరాల కిందట సరిగ్గా ఇదే తరహాలో స్కీం పేరిట స్కాం చేసి కేరళ కు చెందిన ఓ వ్యక్తి పరారైనట్టు చరిత్ర చెబుతోంది.
అంతేకాకుండా ఇటీవలి కాలంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో కూడా ఇటువంటి తరహా లో కస్టమర్ల నుంచి డబ్బులు దండుకొని పరారైన ఘటన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇలా అమాయకులైన బాధిత ప్రజలు చేతులు కాలినాక ఆకులు పట్టుకునే పరిస్థితి దాపురించింది.
ఇదిలా ఉండగా తమకు జరిగిన మోసాన్ని గుర్తించిన సిరిగిరి శ్రీనివాస్ అనే బాధితుడు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
చట్టరీత్య బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. అత్యాశకు పోయి ఇలాంటి మోసాలకు ప్రజలు గురికా వద్దని ఆయన సూచించారు.
