తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపరభగీరథుడు కేసీఆర్ కు కారాగారమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లా బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళ వారం ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ పై కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహలు తొలగించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను బీ ఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా స్థాయి నుంచి నగర, పట్టణ, మండల స్థాయిలో నాయకులు తిలకించారు.
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హరీష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ లు సృష్టించిన అపోహలను పటాపంచలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పూర్తి అవగాహన కల్పించారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ ఇచ్చిన
బోగస్ నివేదిక ఆధారంగా కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ప్రజలు తిరగబడుతారని ఆయన హెచ్చరించారు.
కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలు, ఎలాగైనా ఆయనను అరెస్టు చేసి జైలులో పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుటిల కుతంత్రాలకు ఫుల్ స్టాఫ్ పెట్టకపోతే తెలంగాణ చరిత్ర తిరగరాసేలా మరో మహా సంగ్రామానికి తెరదీస్తామని జీవన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ఎదుర్కోవడానికి ప్రజలతో కలిసి మహాయుద్ధం చేయడానికి గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన మలి విడత ఉద్యమం తొలి రోజు నుంచి కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన గులాబీ ఖిల్లా నిజామాబాద్ జిల్లా నుంచే మళ్ళీ కాంగ్రెస్ అకృత్య పాలనపై సమరశంఖం పూరిస్తామని జీవన్ రెడ్డి ప్రకటించారు.తెలంగాణ సమాజమంతా ఏకమై కాంగ్రెస్ కుటిల కోటలు బద్దలు కొడతామన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ఎండగడ తామన్నారు.
ఇదిలాఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కాంగ్రెస్ అవినీతి బయోపిక్ లా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రిపోర్ట్ నిరాధార అవినీతి ,బూతులు, అబద్దాల తో వండివార్చిన కాంగ్రెస్ వంటకమని ఆయన వ్యాఖ్యానించారు.
అది నుంచి తెలంగాణ విలన్ పాత్ర పోషించిన కాంగ్రెస్ నేతలు కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.కాళేశ్వరాన్ని పండబెట్టి, తెలంగాణ ను ఎండబెట్టి గోదావరి నీరు బనకచర్లకు చేరేలా కాంగ్రెస్ కంకణం కట్టుకుందని ఆయన ఆరోపించారు. తెలంగాణను సర్వనాశనం చేసి చంద్రబాబుకు గురుదక్షిణం చెల్లించుకునేందుకు రేవంత్ రెడ్డి కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
