నగరపాలక సంస్థలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. సోమవారం జరగనున్న కీలకమైన ఎన్నికల ప్రక్రియను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కమిషనరేట్ యంత్రాంగం అప్రమత్తమైంది.
ఆదివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయిచైతన్య స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా సీపీ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ.. మేయర్ ఎన్నిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా కార్పొరేటర్ల రాక, అధికారుల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
కార్పొరేషన్ కార్యాలయం పరిసరాల్లో పటిష్టమైన బందోబస్తును మోహరించాలని, ప్రతి కదలికపై నిఘా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు.
బందోబస్తు పర్యవేక్షణలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎస్. దిలీప్ కుమార్ కూడా పాల్గొని, ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను సీపీకి వివరించారు. టౌన్-4 ఎస్.హెచ్.ఓ. సతీష్తో పాటు ఇతర పోలీసు అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
