నగరంలో పట్టపగలే భారీ దోపిడీ కలకలం రేపింది. నగరంలోని బంగారం దుకాణంలో పనిచేస్తున్న వ్యక్తిని బెదిరించి, సుమారు 20 లక్షల రూపాయల నగదుతో దుండగులు ఉడాయించిన ఘటన శనివారం మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని గుర్బాబాదీ రోడ్డుకు చెందిన అనిల్ పాటిల్ ఛిద్రవార్, గాంధీగంజ్లో వెంకటేశ్వర జూవెలర్స్ దుకాణం ఉంది.
ఈ మేరకు శనివారం ఉదయం తన వద్ద పని చేసే గంగాధర్ పంచాల్ అనే వ్యక్తికి రూ. 19,92,000 నగదు ఇచ్చి, ఐసీఐసీఐ బ్యాంకులో జమ చేయాల్సిందిగా పురమాయించారు. యజమాని చెప్పినట్లుగానే నగదు తీసుకుని గంగాధర్ బ్యాంకుకు బయలుదేరారు. మార్గమధ్యంలో శివాజీ చౌక్ వద్దకు చేరుకోగానే, కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అతడిని అడ్డుకొని బలవంతంగా కారులోకి ఎక్కించుకున్నారనీ తెలిపారు.
బాధితుడిని కారులో బంధించి భయభ్రాంతులకు గురిచేసి అతని వద్ద ఉన్న నగదును లాకున్నారని తెలిపారు. నిజామాబాద్ నుంచి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాసర వద్ద అతడిని కారులో నుంచి దించేసి చాకచక్యంగా పారిపోయారు.
తేరుకున్న బాధితుడు వెంటనే యజమానికి సమాచారం అందించారు. బాధితుడు గంగాధర్ ఫిర్యాదు మేరకు మూడవ టౌన్ ఎస్.ఐ హరిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
