మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు కొరడా ఝులిపించారు. కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత వారం రోజులుగా ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన మందుబాబులకు కోర్టు భారీ జరిమానాలతో పాటు జైలు శిక్షలు విధించినట్లు తెలిపారు.
ఈనెల 19 నుంచి 26వ తేదీ వరకు కమిషనరేట్ వ్యాప్తంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో మొత్తం 129 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయనీ తెలిపారు. పట్టుబడిన వాహనదారులను పోలీసులు సంబంధిత కోర్టుల్లో హాజరుపరచగా, న్యాయమూర్తులు వారికి భారీగా రూ. 8,80,000/- జరిమానా విధించినట్లు తెలిపారు. కేవలం జరిమానాతోనే సరిపెట్టకుండా, మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న 10 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించం: ఇంచార్జి సీపీ
ఈ వివరాలను నిజామాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ ఎమ్. రాజేష్ చంద్ర, వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాహనదారులకు ఆయన కీలక సూచనలు చేశారు: మద్యం సేవించి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదు. ప్రతి వాహనదారుడు తమ వెంట వాహనానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలను తప్పనిసరిగా ఉంచుకోవాలి.నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
