విద్యుత్ శాఖలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ వినియోగదారులకు, ముఖ్యంగా రైతులకు సేవలందించడంలో పారదర్శకతను పెంచేందుకు ‘ఈ-స్టోర్’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు నిజామాబాద్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజేశ్వర్రావు తెలిపారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
గతంలో విద్యుత్ సామగ్రిని పొందాలంటే పలు దశల్లో కాగితపు ప్రక్రియ పూర్తి చేయాల్సి వచ్చేదని, దీనివల్ల సమయం వృథా అయ్యేదని ఎస్.ఈ. పేర్కొన్నారు. “ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగిపోయాయి. క్షేత్రస్థాయిలోని ఏఈలు, ఏఈఈలు తమకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, ఇతర సామగ్రిని కార్యాలయంలోని కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా ఆన్లైన్లోనే రిజర్వ్ చేసుకోవచ్చు.
దీనివల్ల స్టోర్ నుండి మెటీరియల్ పొందడం సులభతరమైంది,” అని ఆయన వివరించారు.ఈ విధానం వల్ల రైతులకు కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, పాడైపోయిన ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, లైన్ మరమ్మతులు వంటి పనులు త్వరితగతిన పూర్తవుతాయి.సామగ్రి లభ్యతపై స్పష్టత ఉండటంతో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించే అవకాశం ఏర్పడింది. స్టోర్లో ఏ మెటీరియల్ ఎంత ఉందో, ఏ పనులకు ఎంత వాడారో అంతా ఆన్లైన్లోనే నమోదు అవుతుంది. దీనివల్ల వ్యవస్థలో పారదర్శకత పెరగడమే కాకుండా నిల్వల నిర్వహణ సులభమవుతుందని ఆయన వెల్లడించారు.
సాంకేతికతను జోడించడం ద్వారా విద్యుత్ శాఖలో పనితీరు మరింత మెరుగుపడిందని, సిబ్బంది ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ప్రజలకు జాప్యం లేని సేవలు అందించాలని ఆయన సూచించారు.
