నేటి స్వార్థపూరిత సమాజంలోనూ మానవత్వం, నిజాయతీ ఇంకా బతికే ఉన్నాయని నిజామాబాద్కు చెందిన ఒక వ్యాపారి నిరూపించారు. రోడ్డుపై దొరికిన విలువైన బంగారు ఉంగరాన్ని దాని యజమానికి తిరిగి అప్పగించి తన ఉదారతను చాటుకున్నారు. నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలోనీ స్థానిక పెయింట్ షాపు యజమాని పులగం సంజీవ్కు తన దుకాణం ముందు 2 గ్రాముల బంగారు ఉంగరం పడి ఉండటం గమనించారు.
వెంటనే అప్రమత్తమైన ఆయన, తన షాపులోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఆ సమయంలో షాపునకు వచ్చి వెళ్లిన వారిని గమనించగా, ఒక వ్యక్తి వద్ద అది జారిపడినట్లు గుర్తించారు. అనంతరం ఆ సమయంలో జరిగిన ఆన్లైన్ పేమెంట్ వివరాల ద్వారా సదరు వ్యక్తి పేరు ఆకాష్ సేన్ అని, అతని ఫోన్ నంబర్ను సేకరించారు.
వెంటనే ఆకాష్ సేన్కు ఫోన్ చేసి విషయం తెలిపిన సంజీవ్, గురువారం నాడు నిజామాబాద్ నాలుగో టౌన్ కు వెళ్లి ఎస్.హెచ్.ఓ సతీష్ కుమార్ సమక్షంలో 2 గ్రాముల బంగారు ఉంగరాన్ని ఆకాష్ సేన్కు అందజేశారు. పోయిందనుకున్న నగను తిరిగి పొందిన ఆకాష్ సేన్.. సంజీవ్ నిజాయతీకి కృతజ్ఞతలు తెలిపారు.
