నిజామాబాద్ నగరపాలక సంస్థపై కాషాయ జెండా ఎగురవేయడం ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..”నిజామాబాద్ కార్పొరేషన్ను బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఒకవేళ నేడు అది సాధ్యపడకపోయినా, రాబోయే ఈ ఐదేళ్ల కాలంలో ఎప్పుడైనా మేయర్ పీఠాన్ని దక్కించుకుంటాం. అవసరమైతే ఈ విషయంలో బాండ్ పేపర్ రాసిచ్చేందుకైనా సిద్ధం” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
శిబిరం నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి..
మేయర్ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఇన్నాళ్లూ రహస్య శిబిరంలో ఉన్న బీజేపీ కార్పొరేటర్లు సోమవారం ఉదయం నగరానికి చేరుకున్నారు.
ఎంపీ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారీలు స్వయంగా కార్పొరేటర్లను ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి తీసుకువచ్చారు.
కార్పొరేటర్లతో కలిసి కార్యాలయానికి చేరుకున్న నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
