బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ మధ్య సవాలు ప్రతిసవాళ్లతో కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరోరా భూములపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం శిశుమందిర్ వద్దకు చర్చకు రావాలని షబ్బీర్ అలీకీ ఎమ్మెల్యే కాటిపల్లి సవాల్ విసిరారు. దీంతో కామారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డలపైకి వచ్చాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి తన అనుచరులతో రాగా అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు మహేందర్ రెడ్డి కారును రోడ్డుపైనే తిరగేసి ధ్వంసం చేశారు.ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పినట్లైంది.
వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల నేతలను అదుపులోకి తిసుకున్నారు. ఎమ్మెల్యే కాటిపల్లి బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు.
అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలో భారీగా పోలీసులు మోహరించారు.
