జిల్లా కేంద్రమైన నిజామాబాద్ నగరంలో ఎక్కడ కూడా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి సూచించారు. వర్షాకాలంను దృష్టిలో పెట్టుకుని నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారులలో మురుగు జలాలు, వర్షపు నీరు నిలువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, ఇతర అధికారులతో కలిసి ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సోమవారం ఉదయం నగరంలోని ఆయా ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు.
బోధన్ రోడ్, ఖిల్లా రోడ్డు, ఫ్రూట్ మార్కెట్, దేవీ థియేటర్ చౌరస్తా, ఖలీల్ వాడి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ బిల్డింగ్ తదితర ప్రాంతాలను సందర్శించారు. స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు.
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు భవన సముదాయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన మార్గాలలోని డ్రైనేజీలను పరిశీలించి, చెత్త చెదారం పేరుకుపోకుండా వెంటవెంటనే శుభ్రం చేయించాలని, వర్షపు జలాలు నిలువ ఉండకుండా సాఫీగా ముందుకు ప్రవహించేలా డ్రైనేజీలపై గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.
వానల వల్ల రోడ్లపై ఏర్పడే గుంతలను వర్షాకాలం అనతరం తక్షణమే పూడ్చివేయించాలని, అవసరమైన చోట డ్రైనేజీల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాలంలో నగర ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికతో అవసరమైన పనులు చేపట్టాలని సూచించారు.
తాగునీరు కలుషితం కాకుండా మంచినీటి సరఫరా తీరును నిశితంగా పర్యవేక్షణ జరపాలని అన్నారు. మరో మూడు నెలలకు అవసరాలకు సరిపడా నీటి నిల్వలు అందుబాటులో ఉన్నాయని, తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదని భరోసా కల్పించారు.
నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన దృష్ట్యా, విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులు ఆరంభం నుండే నాణ్యమైన విద్యను బోధించాలని ఈ సందర్భంగా హితవు పలికారు. కాగా, పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా ఈసారి నగరంలోని అన్ని డివిజన్లలో స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
ఒక్కో సర్కిల్ వారీగా 60 డివిజన్లలో డ్రైనేజీలు, రోడ్లను శుభ్రం చేయడం, చెత్తను తరలించడం, పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలను శుభ్రం చేయడం వంటి పనులు పూర్తయ్యాయని అన్నారు.
సుమారు 70 లక్షల రూపాయల వ్యయంతో మురుగు కాలువల్లో పూడికతీత పనులను కూడా వేగవంతంగా జరిపిస్తున్నామని, అవకాశం ఉన్న చోట జేసీబీల ద్వారా, మిగితా చోట్ల పారిశుధ్య కార్మికులతో డీసిల్టింగ్ పనులు జరిపిస్తున్నామని తెలిపారు.
వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కార్పొరేటర్ షకీల్, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ఉన్నారు.
