రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు.
తన ఛాంబర్ లో సోమవారం జిల్లా అధికారులతో సమావేశమై, రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావులేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు.
ప్రధానంగా ఎక్కడ కూడా తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి బాధ్యతలు పురమాయిస్తూ, నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలని, వీధి దీపాల మరమ్మతులు జరిపించాలన్నారు. బోర్లు, పైప్ లైన్ మరమ్మతులు ఉంటే ముందస్తుగా చేపట్టాలని తెలిపారు.
అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ప్రార్థనా సమయాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రార్థనా మందిరాల వద్ద మసీదులు, ఈద్గాల వద్ద పారిశుధ్య సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య శిబిరాలు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు.
ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, జెడ్పి సీ.ఈ.ఓ సాయాగౌడ్, డీపీఓ శ్రీనివాస్ రావు, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
