సంక్రాంతి పండుగ సెలవులు మొదలు కావడంతో సొంతూళ్లకు ప్రయాణాలు మొదలయ్యాయి .ప్రయాణికులు,విద్యార్థులతో నిజామాబాద్ బస్టాండ్ సందడిగా మారింది. ప్రభుత్యం రేపటి నుంచి విద్యాసంస్థలకు,ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ప్రకటించడంతో కుటుంబ సమేతంగా చాలా మంది సొంతూళ్లకు పయనమయ్యారు.
దీంతో బస్టాండ్ ప్రాంగణం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకున్న ఆర్టీసీ అధికారులు అదనంగా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.సంక్రాంతి సందర్భంగా నిజామాబాద్ నుంచి ఆంధ్రకు వెళ్ళేవారు ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
నిజామాబాద్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లేందుకు అదనంగా 444 ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు.అయిన బస్సులు ఆలస్యంగా వస్తుండడంతో బస్సు రావడమే ఆలస్యం బస్సు ఎక్కేందుకు ప్రయాణికులు ఎగబడుతున్నారు.
దూర ప్రాంతాలకు, ప్రత్యేకంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే ప్రయాణీకుల సౌకర్యార్థం ఆర్మూర్, బోధన్, నిజామాబాద్-1, నిజామాబాద్-2, బాన్సువాడ మరియు కామారెడ్డి నుండి హైదరబాద్ వరకు మరియ విజయవాడ వరకు స్పెషల్ బస్సులను నడుపుతామని తెలిపారు.
ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగినన్ని బస్సులను ఏర్పాటు చేయబడినవి. సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు.
