మున్సిపల్ ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ యంత్రాంగం సర్వసన్నద్ధమైంది.
ఈ నెల 11న జరగనున్న నిజామాబాద్ కార్పొరేషన్ సహా బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ఎన్నికల కోసం పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు.
ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.
గొడవలకు పాల్పడే వారిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు. 1500 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో 3 ప్లాటున్ల టీఎస్ఎస్పీ సిబ్బంది, స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అందుబాటులో ఉంటారు.
చెక్ పోస్టులు 24/7 వాహన తనిఖీలు నిర్వహిస్తూ, నిఘా పెంచారు. 10 ఎఫ్.ఎస్.టీ, 12 ఎస్.ఎస్.టీ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ఎన్నికల ప్రాంతాల్లో 5 లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధం. నిబంధనలు అతిక్రమిస్తే 163 బీఎన్ఎస్ఎస్ (గతంలో 144 సెక్షన్) ప్రకారం కేసులు నమోదు చేస్తారనీ హెచ్చరించారు.
ఈ ఎన్నికల విధుల్లో భాగంగా ఇప్పటివరకు తీసుకున్న చర్యల వివరాలను సీపీ వెల్లడించారు: మొత్తం ఓటర్లు: 4,94,954 మంది. పోలింగ్ కేంద్రాలు: 220 కేంద్రాల్లో పటిష్ట భద్రత. బైండోవర్లు: 162 మందిని తహసీల్దార్ల ముందు హాజరుపరిచి బైండోవర్ చేశారు.ఆయుధాల డిపాజిట్: గన్ లైసెన్స్ కలిగిన 93 మంది తమ ఆయుధాలను డిపాజిట్ చేయగా, మరో 28 బ్యాంక్ సెక్యూరిటీకి సంబంధించినవి ఉన్నాయి.
మద్యం సీజ్: తనిఖీల్లో భాగంగా 42.44 లీటర్ల మద్యం (విలువ రూ. 22,926) స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నియామావళిని ఉల్లంఘించినందుకు ఇప్పటివరకు 5 కేసులు (టౌన్ 1, టౌన్ 3, బోధన్, భీంగల్, ఆర్మూర్ పి.ఎస్.లలో) నమోదయ్యాయి.
ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజు సాయంత్రం 5 గంటల తర్వాత స్థానికేతరులు ఉండకూడదని, అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.
