కామారెడ్డి జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో గల్లంతైన తండ్రి, కూతురు, కుమారుడి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలు విషాదాంతమయ్యాయి. గల్లంతైన ముగ్గురి మృతదేహాలను అధికారులు వెలికితీశారు.ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కుమార్తె, కుమారుడు నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. ఈ సమాచారం అందిన వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.
గాలింపులో భాగంగా ముందుగా బాలిక మృతదేహం లభ్యం కాగా, అనంతరం తండ్రి మరియు కుమారుడి మృతదేహాలను కూడా గజ ఈతగాళ్ల సహాయంతో అధికారులు వెలికితీశారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో నిజాంపేటలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
