నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని బడాపహాడ్ శివారులో శుక్రవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. యాత్రికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు ప్రాంతానికి చెందిన సుమారు 35 మంది యాత్రికులు ఒక ప్రైవేట్ స్కూల్ బస్సులో బడాపహాడ్ దర్గా దర్శనానికి బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున బస్సు బడాపహాడ్ అటవీ ప్రాంతంలోని ఘాట్ రోడ్డు మలుపు వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా బ్రేకులు విఫలమయ్యాయి. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలవ్వగా, మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తెల్లవారుజామున చీకటిగా ఉండటం, అటవీ ప్రాంతంలో మలుపు వద్ద బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
