నగరంలోని ఎనిమిదో డివిజన్ పరిధిలో ఎదురవుతున్న తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్కుమార్ శుక్రవారం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు.
డివిజన్ పరిధిలోని సీతారాంనగర్ కాలనీ, సాయినగర్-3 ప్రాంతాల్లో గత కొంతకాలంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని ఆయన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఆయా కాలనీల్లో భూగర్భ జలాలు అడుగంటి ఇళ్లలోని బోర్లు సైతం ఎండిపోయాయన్నారు.
దీంతో తాగునీటికి, వంటకు, నిత్యం గృహ అవసరాలతో పాటు శుభకార్యాలకు నీరు లేక స్థానిక ప్రజలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సీతారాంనగర్ కాలనీ, సాయినగర్-3 ప్రాంతాల్లో అత్యవసరంగా రెండు కొత్త బోర్లు వేయించాలని కోరారు.
వాటికి అంతర్గత పైప్లైన్ కనెక్షన్లు ఇచ్చి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ సమస్యపై అధికారులు సానుకూలంగా స్పందించి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
