పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయించేందుకు తరలిస్తుండగా నందిపేట్ పోలీసులు పట్టుకున్నారు. రైతుఫామ్ శివారులో మంగళవారం తెల్లవారుజామున నిర్వహించిన తనిఖీల్లో 48 సంచుల్లో ఉన్న 22.60 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నందిపేట్ ఎస్ఐ కె.వినయ్ తెలిపారు.
బియ్యం విలువ రూ.1,12,548గా అధికారులు అంచనా వేశారు. బొలెరో వాహనాన్ని సీజ్ చేసి నలుగురిపై కేసు నమోదు చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ కె.వినయ్ సిబ్బందితో కలిసి రైతుఫామ్ శివారులో వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో AP25X9971 నంబర్ గల మహీంద్రా బొలెరోను తనిఖీ చేయగా.. 48 సంచుల్లో రేషన్ బియ్యం బయటపడింది. వాహన డ్రైవర్ సయ్యద్ అన్సార్ను అదుపులోకి తీసుకుని విచారించారు.ఎస్ఐ కె.వినయ్ కథనం ప్రకారం.. మాక్లూర్కు చెందిన ఛోటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పీడీఎస్ బియ్యాన్ని కిలో రూ.18కు కొనుగోలు చేస్తున్నాడు.
అనంతరం డ్రైవర్ అన్సార్, ఎండీ.మోసిన్ కలిసి ఛోటు వద్ద కిలో రూ.20 చొప్పున కొనుగోలు చేసి.. బహిరంగ మార్కెట్లో రూ.25కు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.నందిపేట్ ఇన్చార్జి డిప్యూటీ తహసీల్దార్ (సీఎస్) గింగురి వినోద్ పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించారు.
స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని శివశక్తి రైస్మిల్కు అప్పగించగా.. వాహనాన్ని పోలీస్స్టేషన్లో భద్రపరిచారు. ఈ ఘటనలో సయ్యద్ అన్సార్, ఎండీ.మోసిన్, ఛోటు, బొలెరో యజమాని మహమ్మద్ తియాబ్ ఖురేషిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కె.వినయ్ తెలిపారు.
