జిల్లాలోని ఆలూర్ మండల కేంద్రంలో భారీ దొంగతనం కలకలం రేపింది. తాళం వేసి ఉన్న ఓ ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి, సుమారు 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 2 లక్షల నగదును ఎత్తుకెళ్లినట్లు పోలీసుకు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తలారి జమున అనే వృద్ధురాలు ఈ నెల 15వ తేదీ ఆదివారం సాయంత్రం తన ఇంటికి తాళం వేసి, జుక్కల్ మండలంలో నివసిస్తున్న తన చిన్న కుమారుడి వద్దకు వెళ్లారు.
వారం రోజులుగా ఇల్లు మూసి ఉండటాన్ని గమనించిన దొంగలు, అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారన్నారు. బీరువాను తెరిచి అందులో ఉన్న బంగారు నగలను, దాచుకున్న నగదును అపహరించుకుపోయారు.
పొరుగువారి సమాచారంతో వెలుగులోకి..
శుక్రవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన స్థానికులు, ఏదో అనర్థం జరిగిందని అనుమానించి వెంటనే జమున కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న బాధితులు, ఇంట్లోని సామాగ్రి చిందరవందరగా పడి ఉండటం, నగలు, నగదు మాయమవడాన్ని చూసి బోరున విలపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరిస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.
