నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ముగ్పాల్ పోలీస్ స్టేషన్ పోలీసులు మరోసారి సమర్థవంతంగా పనిచేసి చోరీకి గురైన ఆరు సెల్ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, CEIR పోర్టల్ మరియు ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో సెల్ఫోన్ల ఆచూకీ కనుగొని వాటిని స్వాధీనం చేసుకున్నారు.
తదనంతరం చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి, స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను సంబంధిత యజమానులకు అప్పగించారు. తమ పోయిన మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు ముగ్పాల్ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో లేదా CEIR పోర్టల్ ద్వారా వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. దీంతో పోయిన మొబైల్ ఫోన్లను త్వరితగతిన గుర్తించి తిరిగి అప్పగించే అవకాశం ఉంటుందని తెలిపారు.
WPC-3072 శ్రీమతి జ్యోతి CEIR పోర్టల్ ద్వారా సెల్ఫోన్లను సమర్థవంతంగా ట్రేస్ చేసి గుర్తించడంలో విశేష కృషి చేసినందుకు ఎస్.ఐ. శ్రీమతి. సుశ్మిత ఆమెను అభినందించి, భవిష్యత్తులో కూడా ఇదే విధమైన సేవాభావంతో విధులు నిర్వహించాలని సూచించారు.
